తొందరలో భారత్‌ను ముంచెత్తనున్న మరిన్ని ఆండ్రాయిడ్ వన్ ఫోన్లు

ఎన్నడు లేనిది గూగుల్ తన కొత్త ఉత్పత్తిని మొదట భారత్‌లో విడుదలచేయడానికి కారణం దిగువ శ్రేణి స్మార్ట్‌ఫోన్ విపణిలో మన దేశంలో గల అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికే అని చెప్పవచ్చు. అంతేకాకుండా కొత్తగా వస్తున్న వివిధ మొబైల్ ఆపరేటింగ్ సిస్టములు భారత దిగువ శ్రేణి ఫోన్ విపణిని లక్ష్యంగా చేసుకుని వస్తుండడంతో గూగుల్ అందరికన్నా
ముందుగానే ఈ రంగంలో కూడా విస్తరించడానికి ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను మొదట భారత్‌లో విడుదల చేసింది. తొలివిడతగా మూడు ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను విడుదల చేసిన గూగుల్ తొందరలో మరిన్ని కంపెనీలతో ఆండ్రాయిడ్ ఫోన్‌లను విడుదలచేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.  ఫోన్ తయారీదారులతోనే కాకుండా క్వాల్‌కం మరియు మీడియాటెక్‌ వంటి మొబైల్ ప్రాససర్ తయారీ సంస్థలతో, ఎయిర్ టెల్ వంటి అగ్రగామి నెట్‌వర్క్ తో కలిసి ఫోన్‌లను విడుదల చేస్తుంది. ఇలా భారత్‌లో విడుదలైన ఆండ్రాయిడ్ వన్ తొందరలోనే మరిన్ని దేశాలలో విడుదలకు గూగుల్ సన్నాహాలు చేస్తుంది.
గూగుల్ వ్యాపార విస్తరణ మరియు వ్యాపార అవకాశాల గురించి ప్రక్కన పెడితే వినియోగదారునికి ఏవిధంగా లాభం కలుగుతుందంటే. 
  • అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్‌లు
  • తక్కువ ధర ఫోన్లలో కూడా తాజా ఆండ్రాయిడ్ వెర్షను
  • తయారీదారు సొంత అప్లికేషన్‌లు మరియు ఆండ్రాయిడ్ మార్పులు తక్కువగా ఉండి అన్ని ఫోన్‌లు ఒకేవిధమైన యూఐతో వాడడానికి సులభంగా ఉంటాయి.
  • తక్కువ ధర ఫోన్‌లలో కలగా మిగిలిన కొత్త ఆండ్రాయిడ్ వెర్షనుకి అప్‌డేట్ కావడం 
  • ప్రారంభ పధకంగా ఆండ్రాయిడ్ అప్‌డేట్లకి మరియు ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్‌లోడ్ లకి డాటా ఉచితంగా లభించడం.
  • ఆండ్రాయిడ్ వన్ దెబ్బకి మిగిలిన ఫోన్‌లు కూడా ధర తగ్గవచ్చు, అదేవిధంగా ధరకి తగ్గ నాణ్యతని లభిస్తుంది. 
  • తక్కువ ధర ఫోన్‌లలో కూడా ప్రాంతియ భాషలకు మెరుగైన మద్దతుని కలిగిఉండడం.